Amrabad Tiger Reserve: దట్టమైన అడవి.. కనీసం సెల్ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. అక్కడ పులుల గాండ్రింపులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. జింకల సయ్యాటలు కూడా ఎక్కువయ్యాయి. గతంలో ఇలా ఉండేది కాదు. కానీ కొంతకాలంగా అక్కడ పులులు పెరుగుతున్నాయి. గతంతో పోలి చూస్తే పులుల సంఖ్య పెరిగింది. ఇదంతా మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. అస్సాం రాష్ట్రంలో ఉన్న అడవుల గురించే కాదు.. మన రాష్ట్రంలో.. అది కూడా తెలంగాణలో పెరిగిన పులుల గురించి..
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది పెద్ద పులులకు అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది.. ఇటీవల అఖిల భారతీయ పులుల సంఖ్య అంచనా 2026 సర్వే ఆధారంగా ఈ అడవిలో మొత్తం 42 పెద్ద పులులు నివాసం ఉంటున్నట్టు సమాచారం. ఇందులో 18 ఆడ.. 14 మగ.. రెండు ప్రీ మెచ్యూర్డ్ టీనేజ్, 8 పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. గడిచిన ఎడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు 8 నెలల పాటు సుమారు 2611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అధికారులు సర్వే నిర్వహించారు.
2024 సర్వే ఆధారంగా ఆమ్రాబాద్ అరణ్యంలో 34 పెద్ద పులులు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 42 కు చేరింది. నల్లమల అడవుల్లో గతంతో పోల్చి చూస్తే ఈసారి జింకల సంఖ్య పెరిగింది. దీనికి తోడు ఆడ పులులు ఎక్కువగా ఉండడంతో సంక్రమణ సజావుగా సాగుతోంది. దీంతో మగ పులులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదు. ఆహార అన్వేషణ కూడా సక్రమంగా సాగుతున్న నేపథ్యంలో పులులు సజావుగా బతుకుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ అటవీశాఖ సమగ్రమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పులుల సంఖ్య పెరుగుతోంది.. వేటగాళ్ల మీద ప్రభుత్వం అత్యంత తీవ్రంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. పులులు స్వేచ్ఛగా బతకగలుగుతున్నాయి.
ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ చర్యలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో జంతువుల కదలికలు రికార్డు అవుతున్నాయి. అటవీ జంతువుల కోసం ప్రత్యేకంగా సోలార్ సహాయంతో నడిచే బోర్లను ఏర్పాటు చేశారు. నీటి కుంటలు తవ్వించారు. తద్వారా వేసవికాలంలో జంతువులు దాహార్తితో బాధపడకుండా ఉండడానికి ఇవి తోడ్పడతాయి. అందువల్లే ఇక్కడ జంతువులు వేసవికాలంలో కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. పులులు కూడా నీటి కుంటల వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకున్నాయి.
