After Meal Walking Benefits: నేటి జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది జిమ్లకు వెళ్లి గంటల తరబడి వ్యాయామం చేస్తున్నారు. అయితే ప్రతిరోజూ జిమ్లో 45 నిమిషాల వర్కౌట్ చేయడం కంటే భోజనం చేసిన తర్వాత కేవలం 15 నిమిషాలు నడవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, బరువు నియంత్రణలో ఈ అలవాటు కీలక పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. అసలు భోజనం చేసిన తరువాత ఎందుకు నడవాలి? శరీరంలో ఏం జరుగుతుంది?
భోజనం చేసిన వెంటనే శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఈ సమయంలో 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల కండరాలు గ్లూకోజ్ను శక్తిగా వినియోగిస్తాయి. దీంతో రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, భోజనం తర్వాత నడక వల్ల రక్తంలో చక్కెర స్థాయులు సుమారు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, అలాగే ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
స్థూలకాయంతో బాధపడుతున్న వారికి భోజనం తర్వాత నడక మంచి అలవాటుగా భావిస్తున్నారు. తిన్న ఆహారంలోని క్యాలరీలు త్వరగా ఖర్చవ్వడంతో పాటు కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. రోజూ క్రమం తప్పకుండా ఈ అలవాటు పాటిస్తే శరీర బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గే అవకాశాలు కూడా పెరుగుతాయి. భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భోజనం అనంతరం నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమై మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోజువారీ నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది. దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ అలవాటు ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత ప్రశాంతంగా నడవడం వల్ల శరీరంతో పాటు మనసుకూ విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నడక సమయంలో శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదల కావడం వల్ల ఉత్సాహం పెరిగి, రోజంతా చురుకుదనం కొనసాగుతుంది.
భోజనం చేసిన వెంటనే వేగంగా పరుగెత్తడం లేదా కఠినమైన వ్యాయామం చేయడం మంచిది కాదు. సాధారణ వేగంతో 10 నుంచి 15 నిమిషాలు నడవడం సరిపోతుంది. ముఖ్యంగా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ వైద్యుల సలహా మేరకు ఈ అలవాటు ప్రారంభించడం ఉత్తమం.

