Mohit Sharma IPL 2023: అహాన్ని ఓడించాడు.. బౌలర్గా రాణించాడు.. మోహిత్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
రెండేళ్ల(2021, 2022)పాటు మోహిత్ శర్మకు ఐపీఎల్ కాంట్రాక్టు దక్కలేదు. అయితే అతడు కృంగిపోలేదు. కొత్తగా ప్రారంభించాలని అనుకున్నాడు.

Mohit Sharma IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మోహిత్ శర్మ ఒకడు. ఒకానొక సమయంలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. రెండు ప్రపంచకప్(2014 టీ20, 2015 వన్డే)లలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే 2020 ఐపీఎల్ సీజన్ తర్వాత క్రికెట్కు పూర్తిగా దూరం అయ్యాడు. ఒక్కసారి జీవితం తలకిందులైంది. కష్టాలు, వరుస దెబ్బలు తగిలాయి. మరొకరు అయితే మళ్లీ జీవితంలో క్రికెట్ ఆడేవారు కాదు. కానీ అక్కడ ఉంది మోహిత్ శర్మ.. వెన్నుగాయం వేధించినా, రెండేళ్లు ఐపీఎల్కు దూరం అయినా ఇవేవీ అతడికి అడ్డుకాలేదు. మధ్యలో అతడి తండ్రి మరణించాడు. ఆ సమయంలో కొంత కుంగిపోయినా తన ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు.
క్రికెట్ను వదిలేయాలని చెప్పినా..
క్రికెట్ వదిలి వేసి వేరే మార్గాన్ని చూసుకోవాలని చాలా మంది మోహిత్కు సలహా ఇచ్చారు. కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న సిద్దాంతాన్ని నమ్మాడు మోహిత్. 2022కు ముందు రూ.6 కోట్లు పలికిన మోహిత్ తర్వాత నెట్ బౌలర్గా మారాడు. ఏది ఏమైతేనేం ఆఖరికి అనుకున్నది సాధించాడు.
ఎన్ని బాధలు ఎదురైనా..
వెన్ను గాయం, షిన్ సమస్యలు, షిన్ ఫ్రాక్చర్, స్ట్రెస్ ఫ్రాక్చర్ కావచ్చు ఇలా ఎన్నో బాధలను మోహిత్ పడ్డాడు. ఆ సమయంలో అతడి స్థానంలో వేరొకరు ఉంటే కచ్చితంగా క్రికెట్ ను విడిచిపెట్టేవారు. అయితే ఆటపై అతడికి ఉన్న నిబద్దత చాలా గొప్పది. అందుకనే అతను తిరిగి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నెట్ బౌలర్గా
రెండేళ్ల(2021, 2022)పాటు మోహిత్ శర్మకు ఐపీఎల్ కాంట్రాక్టు దక్కలేదు. అయితే అతడు కృంగిపోలేదు. కొత్తగా ప్రారంభించాలని అనుకున్నాడు. 2022 సీజన్కు గుజరాత్ టైటాన్స్కు నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. ఆ జట్టు కోచ్ ఆశిష్నెహ్రా సూచనలు, శిక్షణలో మరింత రాటు దేలాడు. నెట్ బౌలర్గా గుజరాత్ టైటాన్స్ జట్టులోని యువ, అనుభవజ్ఞులైన బ్యాటర్లకు అతడు బౌలింగ్ చేశాడు. మెయిన్ బౌలర్గా పనిచేసి.. మళ్లీ నెట్బౌలర్గా చేయడం అంటే చాలా కష్టమౖయెన విషయం. టీమ్ఇండియా తరుపున రెండు ప్రపంచకప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అలాంటి వాడు నెట్బౌలర్గా పని చేయడం అంత సులభం కాదు. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇగో, ఫేమ్తో సహా చాలా విషయాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అయితే మోహిత్ వాటిని పట్టించుకోలేదు. మరోసారి అందరికి తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నాడు.
ఐపీఎల్లోకి రీ ఎంట్రీ
నెట్స్లో పేస్, రిథమ్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ కారణంగా 34 ఏళ్ల మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 సీజన్కు రూ.50లక్షల బ్రేస్ ప్రైస్కు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో మొదటి మూడు మ్యాచుల్లో అతడికి అవకాశం రాలేదు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అతడికి అవకాశం రాగా.. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి తానెంటో నిరూపించుకున్నాడు. ఇంకో మ్యాచ్లో లక్నో విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా మోహిత్పై ఉన్న నమ్మకంతో పాండ్యా అతడికి బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ 7 పరుగుల తేడాతో గుజరాత్కు నమ్మశక్యం కాని విజయాన్ని అందించాడు. మొత్తం మీద ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన మోహిత్ శర్మ 17 వికెట్లు తీశాడు.