Pawan Kalyan : హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేయడమేంటి? అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే అనే వాదన మొదలైంది. ఒకప్పుడు హీరోలు అడవులను పెంచే పాత్రలు చేశారు. కానీ ఇప్పుడు హీరోలు వాటిని నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు.

Written By: S Reddy, Updated On : August 8, 2024 7:30 pm
Follow us on

Pawan Kalyan : సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ముగినిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఒక నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు ఆ అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందినవాడిగా అలాంటి పాత్రలు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, అన్నారు.

ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశాడనే వాదన మొదలైంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. పేదవాడైన పుష్పరాజ్ చిన్నప్పటి నుండి హోదా, గౌరవం, గుర్తింపుకు నోచుకోకుండా పెరుగుతాడు. ఆ అవమానాల నుండి పుట్టిన కసి స్మగ్లర్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఎర్ర చందనం చెట్లు నరికే కూలి స్థాయి నుండి స్మగ్లింగ్ సిండికేట్ ని శాసించే స్థాయికి ఎదుగుతాడు హీరో. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప భారీ విజయం సాధించింది. అల్లు అర్జున్ కి పాన్ ఇండియా హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది.

పుష్ప చిత్రానికి పార్ట్ 2 తెరకెక్కుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఈ చిత్రాన్ని ఉద్దేశించే అనేది సోషల్ టాక్. కొన్నాళ్లుగా మెగా-అల్లు కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే వాదన ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మరింతగా మనస్పర్థలు రాజేశాయనే పుకార్లు ఉన్నాయి. అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవి ఇంటికి స్వయంగా వెళ్లి మద్దతు తెలిపాడు.

పరోక్షంగా అల్లు అర్జున్ జనసేన ప్రత్యర్థి పార్టీకి మద్దతు తెలిపినట్లు అయ్యింది. ఈ ఘటన తర్వాత నాగబాబు పరుష పదజాలంతో ఒక ట్వీట్ వేశాడు. వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబును ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ ని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో అన్ ఫాలో చేశాడు. అలాగే ఉపాసన బర్త్ డే కాగా… అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి విషెస్ చెప్పలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ పుష్ప చిత్రం పై పరోక్షంగా విమర్శలు చేశారు. వరుస పరిణామాల నేపథ్యంలో అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా మరో పాన్ ఇండియా హిట్ కెజిఎఫ్ లో కూడా హీరో స్మగ్లింగ్ కి పాల్పడతాడు. కెజిఎఫ్ లో యష్ హీరోగా నటించాడు. అందులోనూ ఆయన కర్ణాటక హీరో. కాబట్టి పవన్ కళ్యాణ్ జనరల్ గా అందరు హీరోలను ఉద్దేశించి మాట్లాడిన విషయాన్ని అల్లు అర్జున్ కి ఆపాదించడం సరికాదని అంటున్నారు.

మెగా ఫ్యాన్స్ ఈ పుకార్లను కొట్టిపారేస్తున్నారు. మెగా హీరోలందరూ ఒక్కటే. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు. సోషల్ మీడియా అనవసరంగా వివాదం సృష్టిస్తుంది అనే వర్గం కూడా ఉన్నారు. సోషల్ మీడియా చాట్ లో నాగబాబు అల్లు అర్జున్ ని ప్రశ్నించడం జరిగింది.