Site icon OkTelugu

Vidadala Rajini Vs Prathipati Pulla Rao: విడదల రజని వర్సెస్ ప్రత్తిపాటి పుల్లారావు.. చిలకలూరిపేటలో ఏం జరుగుతోంది?

Vidadala Rajini Vs Prathipati Pulla Rao

Vidadala Rajini Vs Prathipati Pulla Rao

Vidadala Rajini Vs Prathipati Pulla Rao: ఏపీ రాజకీయాలు కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్నాయి. అయితే ఆ వాతావరణాన్ని కాస్త మార్చే పనిలో పడ్డారు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. వీరిద్దరికి మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. విడదల రజిని తన రాజకీయ ప్రయాణాన్ని ప్రత్తిపాటి పుల్లారావు సారథ్యంలోనే ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె వైఎస్ఆర్సిపి గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనను తాను చంద్రబాబు నాటిన మొక్కలాగా రజిని అభివర్ణించుకున్నారు. ఆ తర్వాత తన రాజకీయ ప్రయాణాన్ని వైఎస్ఆర్సిపి వైపు మళ్లించుకున్నారు.

2019లో జరిగిన ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా రజనీ పోటీ చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు మీద విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. అయితే ప్రస్తుతం గుంటూరు నియోజకవర్గాన్ని పక్కనపెట్టి.. చిలకలూరిపేట నియోజకవర్గంలోకి రజిని వచ్చారు. తన కార్యవర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నేతలతో భేటీ అవుతున్నారు.. కార్యకర్తల గృహాలలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే రజిని మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అవినీతికి అండగా నిలిచారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపిస్తున్నారు.. తన మామ, మరిది, భర్త ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని.. ఇప్పుడే ఆమె గురించి దృష్టి సారించామని.. ఆమె చేసిన అవినీతి మొత్తం వెలుగులోకి వస్తోందని పుల్లారావు చెబుతున్నారు. ఇటీవల రజని మామ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మరిదిపై కూడా అభియోగాలు మోపారు. ఇది రజనికి ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆమె ఒకసారిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు..” ప్రత్తిపాటి పుల్లారావు.. మాకు ఒకరోజు వస్తుంది గుర్తుపెట్టుకో.. కచ్చితంగా వడ్డీతో సహా మేం చెల్లిస్తాం. ఇంకో నాలుగు సంవత్సరాలు అధికారం ఉంది కాబట్టి.. అడ్డగోలుగా దోచుకోవచ్చు.. బ్యాగు నిండా డబ్బులు సంపాదించుకోవచ్చు.. అనుకుంటున్నావేమో.. నేను ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేయగలను. దేవుడు చల్లగా చూస్తే ఇదంతా చేయగలను.. మహా అయితే నువ్వు ఈ టర్మ్ వరకే ఉండగలవు. నాలుగేళ్ల తర్వాత జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎక్కడ దాచుకున్నా.. ఏ మూలన దాగివున్నా వదిలే ప్రసక్తి లేదు. కచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని” రజని అన్నారు.

రజిని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడంతో.. పుల్లారావు కూడా అదే స్థాయిలో స్పందించారు..” ఏంటమ్మా నువ్వు చేసింది.. ఏడు నెలల కాలంలో ఎక్కడికి వెళ్లి పోయావు.. ఇప్పుడు చిలకలూరిపేటకు ఎందుకు వచ్చావు.. నువ్వు చేసిన అక్రమాలు.. నువ్వు చేసిన అవినీతి.. నీ అనుచరులు చేసిన దౌర్జన్యాలు అన్ని వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడే మేం మొదలుపెట్టాం.. ఇంకా తవ్వుతూనే ఉంటాం. అన్ని బయట పెడుతూనే ఉంటాం. నువ్వు చూస్తూ ఉండు.. కచ్చితంగా అన్ని జరిగిపోతాయి.. నేను కూడా సిద్ధంగానే ఉన్నా. భయపడే ప్రసక్తి లేదని” పుల్లారావు వ్యాఖ్యానించారు.. ఒకప్పుడు ఒకే గొడుగు కింద రాజకీయాలు చేసిన పుల్లారావు, రజని ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు.. ఢీ అంటే ఢీ అనే తీరుగా సవాళ్లు విసురుకొంటున్నారు. అయితే కేసుల విషయంలో.. అక్రమాలను వెలుగులోకి తెచ్చే విషయంలో తాను ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదని పుల్లారావు వ్యాఖ్యానించడంతో చిలకలూరిపేటలో రాజకీయాలు యమా హాట్ గా మారాయి.. మరోవైపు టీడీపీ, వైసీపీ శ్రేణులు కూడా పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో చిలకలూరిపేటలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.

Exit mobile version