Lok Sabha Election 2024: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా శనివారం(మే 25న) దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాత్రి 7:45 గంటల వరకు పోలింగ్ 59.06గా నమోదైంది. అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 72 శాతం నమోదు కాగా, అత్యల్పంగా ఢిల్లీలో కేవలం 34.4 శాతం ఓటింగ్ నమోదైంది.
రాష్ట్రాల వారీగా పోలింగ్..
దేశవ్యాప్తంగా ఢిల్లీలోని 7 నియోజకవర్గాలు, హరియాణాలోని 10 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాలు, బిహార్, పశ్చిమబెంగాల్లో 8 నియోజకవర్గాల చొప్పున, ఒడిశాలో 6 నియోజకవర్గాలు, జార్ఖండ్లో 4, జమ్మకశ్మీర్లో ఒక నియోజకవర్గానికి ఎన్నిలు జరిగాయి. వీటితో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజవర్గాలు, హర్యానాలోని కర్నల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగింది.
ఓటేసిన ప్రముఖులు..
ఆరో విడత లోక్సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్త్రపతి దన్కర్, కేంద్ర మంత్రులు ఎస్.జయశంకర్, హర్దీప్సింగ్, ఢిలీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రి అతిశీ, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఓటేశారు. ఇక పోలింగ్ బూత్లో తొలి పురుష ఓటర్గా ఓటుహక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి జయశంకర్కు సర్టిఫికెట్ ఇచ్చారు. దానిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బెంగాల్లో ఘర్షణ..
ఎన్నిల సందర్భంగా పశ్చిమబెంగాల్లో ఘర్షణలు జరిగాయి. జర్ర్గామ్ బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై రాళ్లదాడి చేయడంతో ఆయన భయంతో పరుగులు తీశారు. ఈవీఎం మొరాయించిందని సీపీఐ(ఎం) నేత బృందా కారత్, తమవారిని అడ్డుకోవడంపై కశ్మీర్లో మెహబూబాబుఫ్తీ నిరసత తెలిపారు.