Overseas Scholarships: విదేశీ విద్యానిధికి దరఖాస్తులు షురూ.. రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం.. అక్టోబర్‌ 13 వరకు అవకాశం

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఆర్థికసాయం చేస్తున్నాయి. విదేశీ విద్యానిధి పథకంలో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఈ పథకంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Written By: Raj Shekar, Updated On : August 15, 2024 7:41 pm

Overseas Scholarships

Follow us on

Overseas Scholarships: డాలర్‌ డ్రీమ్‌.. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితం. కానీ, టాలెంట్‌ ఉన్న ప్రతీ విద్యార్థికి అవకాశం దక్కుతోంది. ప్రతిభ ఉండి.. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన‍్న కోరిక ఉంటే చాలు మేమున్నాం అంటూ బ్యాంకులు అవసరమైన రుణాలు అందిస్తున్నాయి. ఇక విద్యార్థుల ప్రతిభ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థికసాయం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ధనిక, పేద అని తేడా లేకుండా చాలా మంది విదేశాలకు చదువుల కోసం వెళ్తున్నారు. ఎక్కువగా మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎందులోనూ తక్కువగా ఉండకూడదన్న భావనతో అప్పులు చేసి మరీ విదేశాల్లో చదువుకునేందుకు పంపిస్తున్నారు. ఈమేరకు చిన్నతనం నుంచే వారిని మానసికంగా సంసిద్ధులను చేస్తున్నారు. దీంతో అమెరికా, కెనడా, యూకే, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, ఉక్రెయిన్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో చదువుకునేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది తెలంగాణ నుంచి విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు విదేశీ విద్యానిధి స్కీం ద్వారా ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆగస్టు 14వ తేదీ నుంచి ఎస్సీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అక్టోబరు 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్‌ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది.

వీరు అర్హులు..
ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే విద్యార్థి సంవత్సర ఆదాయం రూ.5 లక్షలోపు మాత్రమే ఉండాలి. ఈ స్కీంలో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్లొచ్చు. ఈ స్కీంకు ఎంపికైతే రూ.20 లక్షల వరకు ఉపకార వేతనం పొందవచ్చు. కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యూయేషన్‌లో 60 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. GRE/GMAT లో అర్హత స్కోర్ ఉండాలి. ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా రూ.20లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా చార్జీలతోపాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.

20 శాతం వెయిటేజీ..
ఇక విద్యార్థి సాధించిన స్కోర్‌కు విదేశీ విద్యానిథి పథకంలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈలకు 20శాతం ఇస్తారు. మెరిట్ లిస్ట్‌ ఎంపికలో స్కోర్‌ పరిగణలోకి తీసుకుంటారు. విదేశాల్లో అడ్మిషన్‌ పొందే యూనివర్సిటీల్లో స్కోర్‌ పరిగణలోకి తీసుకోకపోయినా దరఖాస్తు సమయంలో మాత్రం వాటిని పేర్కొనాల్సి ఉంటుంది.

కావాల్సిన పత్రాలివే:
కుల ధ్రువీకరణ పత్రం
ఆదాయపత్రం(ఇన్కమ్‌ సర్టిఫికెట్)
పుట్టిన తేదీ ధ్రువపత్రం
ఆధార్ కార్డు
ఈ-పాస్ ఐడీ నెంబర్
ఇంటి నంబర్ వివరాలు
పాస్ పోర్టు కాపీ
పది, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల మెమోలు
• GRE /GMAT స్కోర్ కార్డు
• TOFEL/IELTS స్కోర్ కార్డు
అడ్మిషన్ ఆఫర్ లెటర్ (ఫారిన్ యూనివర్సిటీ నుంచి)
బ్యాంక్ వివరాలు
పాస్‌పోర్టు సైజు ఫొటో