ODI World Cup 2023 Prize Money: వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్మనీ ఎంతో తెలుసా ?.. ఛాంపియన్ కు పడుగే!!
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది.

ODI World Cup 2023 Prize Money: వన్డే వరల్డ్కప్ 2023 మరో 12 రోజుల్లో(అక్టోబర్ 4న) ప్రారంభం కానుంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో పాల్గొనే జట్లలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఇండియా చేరుకుంది. త్వరలో మిగతా జట్లు రానున్నాయి. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి శుక్రవారం (సెప్టెంబర్ 22) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ ఈసారి భారీ ప్రైజ్మనీని నిర్ణయించింది. మొత్తం ప్రైజ్మనీ రికార్డు స్థాయిలో 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు).
విభజన ఇలా..
ఈ మొత్తం ప్రైజ్మనీ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్ట్లు, గ్రూప్ స్టేజ్లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది. రూ.83 కోట్ల ప్రైజ్ మనీ మొత్తంలో వరల్డ్కప్ విజేతకు 40 లక్షల యూఎస్ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్కు 20 లక్షల యూఎస్ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్లకు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్ డాలరు (82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్మనీగా అందుతుంది. ఈ స్థాయిలో ప్రైజ్మనీ అందనుండటం ఐసీసీ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి.
అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్..
ఇదిలా ఉంటే, ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అక్టోబర్ 5న హ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్తో మెగా టోర్నీ ముగుస్తుంది.
