ఢిల్లీ పోలీసులకు ఆయుధాలు ఆభరణాలా!
ఢిల్లీలో విచ్చలవిడిగా హింసాయుత సంఘటనలు ప్రారంభమై మత ఘర్షణలుగా మారడానికి ఎవ్వరు కారకులు? తగినంత సంఖ్యలో పోలీసులు లేరని ఇప్పుడు కొత్తగా సాకులు చెబుతున్నారు. అయితే పోలీసుల ముందే విచ్చలవిడిగా దుండగులు తుపాకులతో కాల్పులు జరుపుతుంటే, ఇంతవరకు భారత దేశంలో మరెక్కడా జరగని రీతిలో అగ్నిమాపకదళం, అంబులెన్సు లపై కూడా దాడులు జరుపుతుంటే ఎందుకు వారు మౌనంగా ఉన్నారు? తమ చేతులలో తుపాకులకు ఎందుకని పని అప్పచెప్పలేదు? ఢిల్లీలో `సూపర్ కాప్’ మరెవ్వరో కాదు. ఎంతో బలమైన […]

ఢిల్లీలో విచ్చలవిడిగా హింసాయుత సంఘటనలు ప్రారంభమై మత ఘర్షణలుగా మారడానికి ఎవ్వరు కారకులు? తగినంత సంఖ్యలో పోలీసులు లేరని ఇప్పుడు కొత్తగా సాకులు చెబుతున్నారు. అయితే పోలీసుల ముందే విచ్చలవిడిగా దుండగులు తుపాకులతో కాల్పులు జరుపుతుంటే, ఇంతవరకు భారత దేశంలో మరెక్కడా జరగని రీతిలో అగ్నిమాపకదళం, అంబులెన్సు లపై కూడా దాడులు జరుపుతుంటే ఎందుకు వారు మౌనంగా ఉన్నారు? తమ చేతులలో తుపాకులకు ఎందుకని పని అప్పచెప్పలేదు?
ఢిల్లీలో `సూపర్ కాప్’ మరెవ్వరో కాదు. ఎంతో బలమైన నేతగా ప్రచారం జరుగుతున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. ఆయనకు పరిస్థితులను సమీక్షించి, అవసరమైతే కాల్పులు జరపమని చెప్పడానికి మూడు రోజులు పట్టింది. అప్పటికే సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక పోలీస్ కూడా ఉన్నారు.
అప్పటిదాకా కాల్పులు జరపని పోలీస్ లను ముందుగా సస్పెండ్ చేయాలి. వారి చేతులలో ఉన్న ఆయుధాలు కేవలం ఆత్మరక్షణకు, ప్రజలను కాపాడడానికి, ప్రభుత్వ – ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే. అవి ఆభరణాలు కానేకావు. కానీ, పోలీస్ లను ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంను నియంత్రించే రాజకీయ ప్రయోజనాలకు పరిమితం చేస్తూ ఉండడంతో వారు అవసరమైనప్పుడు తుపాకులకు పని చెప్పలేక పోయారు.
ప్రతిపక్ష పార్టీలలో ఫిరాయింపు దారులను ప్రోత్సహింప చేసి రాజ్యసభలో కీలకమైన బిల్లులకు ఆమోదం పొందడంలో నేర్పరి అయిన అమిత్ షా ఆర్టికల్ 370, సిఏఏ వంటి బిల్లును ఎటువంటి పూర్వరంగం సిద్ధం చేయకుండా అకస్మాత్తుగా తీసుకొచ్చి, ఆమోదింప చేసుకో గలిగారు. కానీ ప్రజాక్షేత్రంలో సమస్యలు ఎదురైతే మాత్రం వెన్ను చూపుతున్నారు.
ఆరు నెలలు అయినా ఇప్పటి దాకా కాశ్మీర్ వెళ్లే సాహసం చేయలేక పోతున్నారు. సిఏఏ చట్టం తీసుకొచ్చే ముందు కూడా రాగాల పరిణామాల గురించి కించిత్తు కూడా ఆలోచించిన్నట్లు లేదు. అందుకనే రెండు నెలలకు పైగా నిరసనలు పలు చోట్ల చెలరేగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
ఢిల్లీలో షహీన్ బాగ్ లో రెండు నెలలకు పైగా నిరసనలు చేస్తుంటే కనీసం వారిని విరమించమని ఒప్పించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిందా? గతంలో యుపిఎ హయాంలో అన్నాహజారే ఢిల్లీలో సత్యాగ్రహం చేస్తానంటూ వస్తే విమానాశ్రయంలోని నలుగురు కేంద్ర మంత్రులు కలిసి, ఆయనను నివారించే ప్రయత్నం చేశారు. కానీ అమిత్ షా కనీసం అటువంటి ప్రయత్నమే చేయలేదు.
పైగా, నిరసనలు చేస్తున్న గురించి బీజేపీలో ప్రముఖులే రెచ్చగొట్టే విధంగా, బాధ్యతారాహిత్యంగా వాఖ్యలు చేస్తుంటే వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. వారెవ్వరిపై కేసులు కూడా నమోదు చేయక పోవడంపై ఢిల్లీ హై కోర్ట్, సుప్రీం కోర్ట్ నిలదీయడం తెలిసిందే. ఢిల్లీలో అల్లర్లను ఎవ్వరు ప్రారంభించినా, ఎందుకు చేస్తున్నా వాటిని కట్టడి చేసి హింస ప్రజ్వరిల్లకుండా చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ మంత్రి అమిత్ షా వైఫల్యమే కారణం అని చెప్పక తప్పదు.
చివరకు హోమ్ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి బాధ్యతారహితంగా రాహుల్ గాంధీ హింసను రెచ్చగొట్టారని ప్రకటన చేశారు. కానీ అమిత్ షా ఏమాత్రం యాదృశ్చికంగా హింస చెలరేగినదని చెబుతున్నారు. అంటే ప్రభుత్వంలోనే హింసపై గందరగోళం నెలకొన్నది అన్నమాట.