CM Jagan: మారుతున్న జగన్ స్వరం.. ఏది హుందాతనం
తన స్థాయిని దిగజార్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభలు, సమావేశాల్లో మునుపటి ముఖ కవలికలు లేక బేలతనం కనిపిస్తోంది. మొత్తానికై విపక్షం గెలిస్తే అన్న మాట పలికి నిజంగా జగన్ భయపడుతున్నట్టు జనాలకు కనిపించడం వైసీపీకి మైనస్సే..

CM Jagan: ఏపీ సీఎం జగన్ స్వరం మారుతోంది. ధీమా కాస్తా భయానికి దారితీస్తోంది. నా వెంట్రుక పీకలేరు అన్న మాట నుంచి వారందరూ కలుస్తున్నారన్న కలవరపాటు కనిపిస్తోంది. అంతిమంగా మునుపటిలా ముఖంలో అసలు ధీమా కనిపించడం లేదు. ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. అదే తన మాటల ద్వారా ధ్వనిస్తోంది. చివరకు అవి సొంత పార్టీ శ్రేణులనే ఆలోచింపజేస్తున్నాయి. కావలిలో చుక్కల భూములకు సంబంధించి పట్టాలను జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఉన్న అసహనాన్ని బయటపెట్టాయి. ప్రభుత్వ కార్యక్రమం కాస్తా పార్టీ సభగా మారిపోయింది. సభలో మాట్లాడినంత సేపు ఆత్మస్తుతి, పరనిందే సాగింది. చివరకు తన ప్రభుత్వంపై విశ్లేషిస్తున్న వారిపై వర్ణ వివక్షకు దిగడానికి కూడా జగన్ వెరవలేదు.
పవన్ ప్రకటనలతోనే..
అయితే నిన్నటి వరకూ ఒక ఎత్తు అన్నట్టు సాగింది జగన్ వ్యవహార శైలి. ఎప్పుడైతే పవన్ మీడియా ముందుకొచ్చి పొత్తులు ఖాయమని స్పష్టం చేశారు. సీఎం పదవితో పనిలేదన్నట్టు మాట్లాడారు. అప్పటి నుంచి జగన్ లో ప్రస్టేషన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అదే కావలి సభలో ప్రస్పుటమైంది. చంద్రబాబు, పవన్ లను టార్గెట్ చేసి జగన్ ప్రసంగం సాగింది. చంద్రబాబు గెలిస్తే స్కీములు రావని ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. పేదలకు డబ్బు పంచడం బాధ్యతారాహిత్యమని టీడీపీ, వారి తోటివారు ఆరోపిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. టీడీపీకి ఓటు వేయడమంటే సంక్షేమ పథకాలు రావని అర్ధమన్నారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే, దోచుకో పంచుకో తినుకోగా సాగుతారని ఆరోపించారు. అయితే తరచూ చంద్రబాబు గెలిస్తే అన్నమాటను జగన్ వాడడం మారిన వైఖరిని తెలుస్తోంది.
మారిన ‘స్లో’గన్
గడిచిన ఎన్నికల్లో అన్న వస్తున్నాడు అంటూ స్లోగన్ ఇచ్చారు. ఈసారి మాత్రం మీ బిడ్డ వస్తున్నాడంటూ చెప్పుకొస్తున్నారు. మీ
బిడ్డకు అండగా ఉండాలంటూ ప్రాథేయపడుతున్నంత పని చేస్తన్నారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటు జరిగితే పేదవాళ్లు బతకరని జగన్ హెచ్చరిస్తున్నారు. మీ ఇంట మంచి జరగాలంటే, మీ బిడ్డకి మీరే సైనికులుగా ఉండండని దీనంగా అడిగినంత పనిచేశారు.
జగన్ వేడుకోళ్లు చూసి ఇంత దారుణమైన పరిస్థితిలోకి వచ్చామా అని సభకు వచ్చిన వైసీపీ క్యాడర్ కూడా అనుమానపడింది. అధినేత తీరుపై రకరకాలుగా చర్చించుకుంటోంది. కేవలం చంద్రబాబు, పవన్ చుట్టూనే జగన్ ప్రసంగం సాగుతోంది.
హుందాతనం ఏదీ?
అయితే ఆయన ఓ పార్టీ అధినేతగా, ఈ రాష్ట్రానికి సీఎంగా హుందాతనం చూపడం మరిచిపోతున్నారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాదిరిగా నోటికి పనిచెబుతున్నారు. చివరకు జీవీరావు అనే ఆర్థిక నిపుణుడిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆఫ్రికా నుంచి వచ్చాడంటూ చాలా తేలికపాటి మాటలు ఆడారు. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే.. ఆయన ఈనాడుకు ఇంటర్వ్యూ ఇవ్వడమే. నిజానికి ఆ జీవీ రావు సాక్షిలో బిజినెస్ అనలిస్ట్. దాని వల్లే ఆయనకు గుర్తింపు వచ్చింది. చివరికి ఆయనను విమర్శించి.. తన స్థాయిని దిగజార్చుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభలు, సమావేశాల్లో మునుపటి ముఖ కవలికలు లేక బేలతనం కనిపిస్తోంది. మొత్తానికై విపక్షం గెలిస్తే అన్న మాట పలికి నిజంగా జగన్ భయపడుతున్నట్టు జనాలకు కనిపించడం వైసీపీకి మైనస్సే..
