Chandrababu – TDP Cadre : కట్టుదాటుతున్న తమ్ముళ్లు.. కట్టడి చేయలేని చంద్రబాబు
నిజం చెప్పాలంటే చంద్రబాబు భయపడుతున్నారు. పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నా కంట్రోల్ చేయలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉండడం పార్టీ శ్రేణులను సైతం విస్మయపరుస్తోంది.

Chandrababu – TDP Cadre : టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. లైన్ ను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పార్టీ అధినేత చంద్రబాబు తరచూ చేసే హెచ్చరికలు ఇవి. మొన్న మహానాడులో ఇదే మాదిరిగా సెలవిచ్చారు. కానీ అది అమలుచేయడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే భయపడుతున్నారు. పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నా కంట్రోల్ చేయలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉండడం పార్టీ శ్రేణులను సైతం విస్మయపరుస్తోంది. అధినేత కలుగజేసుకోకుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
అలక వేరు, అసంతృప్తి వేరు. కానీ టీడీపీ నేతలు ఏకంగా హైకమాండ్ కే సవాల్ చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని గత కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా సొంత తమ్ముడు కేశినేని చిన్నిని ఎగదోలడంపై ఆయన బాహాటంగానే మండిపడుతున్నారు. ఇటీవల పిట్టలదొరకు టికెట్ ఇస్తారేమో అంటూ వ్యంగ్యక్తులు సంధించారు.. చిలకలూరిపేట టీడీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తోపుడు బండ్లు పంపిణీ చేసే వాళ్లకు టికెట్ ఇస్తారా? అంటూ భాష్యం ప్రవీణ్ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానాన్ని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లాలో రోడ్డుపై నేతలు కొట్టుకున్నారు. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య గొడవ బజారుకెక్కింది. ఏవీ సుబ్బారెడ్డిపై లోకేశ్ పాదయాత్రలోనే అఖిలప్రియ దాడి చేయించారు. ఈ కేసులో ఆమె వారం రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. పైగా తన చున్నీని లాగాడంటూ ఏవీపై అఖిలప్రియ ఆరోపణలు చేశారు. నంద్యాల, ఆత్మకూరులలో కూడా తాను ప్రచారం చేస్తానని ఆమె బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్చార్జ్లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా వర్గాన్ని అఖిలప్రియ కూడగడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం పార్టీకి అల్టిమేటం ఇచ్చినంత పనిచేశారు. చంద్రబాబునే ఏకంగా నిలదీశారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై ఫైర్ అయ్యారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం తాను, తన తల్లి ప్రాథేయపడుతున్నా ఇవ్వలేదని సంచలన కామెంట్స్ చేశారు. చర్చించడానికి వెళ్లిన టీడీపీ నేతలను సైతం అడ్డుకోవడం గమనార్హం. అయితే ఈ పరిణామాలకు అందరి వేళ్లు చూపిస్తోంది లోకేష్ వైపే. సీనియర్లకు ప్రత్యామ్నాయంగా కొందరు జూనియర్లను ప్రోత్సహిస్తోంది ఆయనేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొలదీ వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
