కిషన్ రెడ్డిపై తెలంగాణ బీజేపీలో రుసరుసలు!
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రమంత్రివర్గంలో ఉన్న ఏకైక ప్రతినిధిగా, కీలకమైన హోమ్ మంత్రిత్వ శాఖలో ఉండి కూడా జి కిషన్ రెడ్డి పార్టీ ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదని తెలంగాణ బిజెపి వర్గాలలో అసంతృప్తి సెగలు రాజుకొంటున్నాయి. మరోవంక, బాధ్యతాయుతమైన స్థాయిలో ఉంటూ అసందర్భపు ప్రకటనలు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నారని అంటూ స్వయంగా హోమ్ మంత్రి అమిత్ షా ఇప్పటికి కనీసం రెండు సార్లు పిలిచి మరీ చివాట్లు పెట్టిన్నట్లు తెలుస్తున్నది. నిర్మల్ […]

ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రమంత్రివర్గంలో ఉన్న ఏకైక ప్రతినిధిగా, కీలకమైన హోమ్ మంత్రిత్వ శాఖలో ఉండి కూడా జి కిషన్ రెడ్డి పార్టీ ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదని తెలంగాణ బిజెపి వర్గాలలో అసంతృప్తి సెగలు రాజుకొంటున్నాయి.
మరోవంక, బాధ్యతాయుతమైన స్థాయిలో ఉంటూ అసందర్భపు ప్రకటనలు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నారని అంటూ స్వయంగా హోమ్ మంత్రి అమిత్ షా ఇప్పటికి కనీసం రెండు సార్లు పిలిచి మరీ చివాట్లు పెట్టిన్నట్లు తెలుస్తున్నది.
నిర్మల్ జిల్లా భైన్సాలో మున్సిపల్ ఎన్నికల ముందు అధికార పక్షం అండదండలతో మతఘర్షణలు చెలరేగితే, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే నెలరోజుల వరకు పట్టించుకోక పోవడం తెలిసిందే.
నెలరోజుల తర్వాత తీరుబడిగా భైన్సాలో పర్యటన జరిపి, బాధితులకు పార్టీ నలుగురు ఎంపీల తరపున రూ 20 లక్షల విరాళం ప్రకటించి, సానుభూతి చూపి వెళ్లారు. కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పడం మినహా నిర్దుష్టమైన ఎటువంటి చర్యను ప్రకటించక పోవడం గమనార్హం.
తాజాగా, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సందర్భంగా కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలు పార్టీ పరువును మంటగరిపే విధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో బిజెపి వర్గాల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. `ఎర్రబస్సులలో తిరిగే తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోదీ వచ్చి రైళ్లలో తిరిగి అవకాశం కల్పిస్తున్నారు’ అంటూ ఒక విధంగా ప్రజలను అవమానించారని ఆ పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి.
నిజాం కాలం నుండే తెలంగాణలో రైల్వే వ్యవస్థ ఉండటం గమనార్హం. ఢిల్లీ పెద్దల మెప్పు పొందటానికి కావాలని మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో గానీ ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమాన పరిచేవిగా ఉన్నాయి. మోదీ వచ్చేదాక తెలంగాణ ప్రజలకు అసలు రైలు అంటేనే తెలియదని అవహేళనగా మాట్లాడారు.
మోదీ దయవల్లే తెలంగాణ ప్రజలకు రైలు అంటే ఎంటో తెలిసిందని, అంతకు ముందు ఎర్రబస్సే దిక్కని ఎగతాళిగా మాట్లాడారు. హైదరాబాద్ స్టేట్ దేశంలోనే సొంతంగా రైల్వే వ్యవస్థను కలిగిఉన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న అమిత్ షా పిలిచి మరి ఇష్టం వచ్చిన్నట్లు మాటలు జారవద్దని హితవు చెప్పారని తెలుస్తున్నది.
అంతకు ముందు అక్రమంగా వలస వచ్చి, రోహ్యాంగి ముస్లింలు హైదరాబాద్ లు కూడా ఉన్నారంటూ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సహితం వివాదంపై దారితీసింది. దానితో అమిత్ షా ఢిల్లీకి పిలిపించి హెచ్చరిక లాంటిది చేశారు. బాధ్యతమైన హోమ్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రతి మాట ఆచి, తూచి మాట్లాడాలని సున్నితంగా మందలించారు.