Telangana BJP: తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్లాన్ రెడీ: బీఆర్ఎస్ టార్గెట్ గా సరికొత్త ప్రణాళిక
భారతీయ జనతా పార్టీలోని ప్రముఖుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఈసారి ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.

Telangana BJP: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన మరుసటిరోజే భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా భారత రాష్ట్ర సమితిని నిలువరించాలనే ఉద్దేశంతో సరికొత్త ప్రణాళిక అమలు చేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితా ప్రకటించాలి అనుకుంటున్నది. చత్తీస్గడ్, మధ్యప్రదేశ్లో అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటించింది. మరో వారం లేదా పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేయనుంది. అయితే ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదిరిపోయే స్కెచ్
మొత్తం 119 అసెంబ్లీ స్థానాలను మూడు కేటగిరీలుగా భారతీయ జనతా పార్టీ విభజించింది. ఇప్పటివరకు గెలిచిన స్థానాలు, రెండవ కేటగిరీలో గత ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన స్థానాలు, మూడవ కేటగిరిలో విజయావకాశాలు ఉన్న స్థానాలు.. గత ఎన్నికల్లో రెండవ స్థానం వచ్చిన స్థానాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని.. ఈ స్థానాల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా వంటి దిగ్గజాల పర్యటనలు ఉండేలా చూసుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. ఇక పార్టీ విభజించిన ఆ మూడు కేటగిరీల సమాచారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కోరినట్లు సమాచారం. అది అందిన వెంటనే బిజెపి సెంట్రల్ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థుల జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది.
మహిళలకు అధిక స్థానాలు
దారి మహిళలకు అధిక స్థానాలకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 33 శాతం మహిళా రిజర్వేషన్ తెరపైకి తీసుకొచ్చిన కవితకు, భారతీయ రాష్ట్ర సమితి చెక్ పెట్టేందుకు అధిక స్థానాలు మహిళలకు కేటాయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈసారి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్య తొలిసారి అసెంబ్లీ బరిలో నిలవాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అంబర్పేట లేదా ముషీరాబాద్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి సైతం సికింద్రాబాద్ లేదా సనత్ నగర్ నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బిజెపి అధిష్టానానికి దత్తాత్రేయ విజ్ఞప్తి కూడా చేసినట్టు సమాచారం.
బరిలో ప్రముఖులు
భారతీయ జనతా పార్టీలోని ప్రముఖుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఈసారి ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. డీకే అరుణ, విజయశాంతి, జయసుధ, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి, జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన జూలూరు కీర్తి రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తికి సీట్లు ఖరారు అయినట్టు సమాచారం.. ఇబ్రహీంపట్నం నుంచి రాణి రుద్రమ, సనత్ నగర్ నుంచి ఆకుల విజయ, చేవెళ్ల నుంచి శ్రీవాణి, డాక్టర్ వీరపనేని పద్మ తదితరులు కూడా ఈసారి అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
కిషన్ రెడ్డి రాజ్యసభకు?
తన సతీమణి కావ్యకు అధిష్టానం అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తే కిషన్ రెడ్డి రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే పార్టీని ముందు నుంచి నడిపించాలి అంటే కిషన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడం మంచిదని కొంతమంది చెబుతున్నారు. ఆయన పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని మరి కొంతమంది అంటున్నారు. 2024 తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. జేపీ నడ్డా రిటైర్ అయిన తర్వాత కిషన్ రెడ్డి కేంద్రంలో మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ వ్యూహంలో భాగంగానే ఆయన తన భార్య పేరును తీసుకొచ్చారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి అధిష్టానం మదిలో ఏముందో తెలుసుకోవాలంటే మరో వారం లేదా పది రోజులు ఆగాల్సిందే.
