ASP Hanumanthu: ఇది కథ కాదు.. అడుక్కుతిని ఐపీఎస్ అయ్యాను.. అనంతపూర్ ఏఎస్పీ హనుమంతు సస్సెస్ స్టోరీ వైరల్ వీడియో!
భిక్షాటన చేసుకుని చదివాను. చదువు నన్ను ఈస్థాయికి తీసుకొచ్చింది. నాడు మమ్మల్ని చీదరించుకున్నవారు ఇప్పుడు చేతులెత్తి నమస్కరిస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఆరుగురు డాక్టర్లు ఉన్నారు.

ASP Hanumanthu: అతనో ఐపీఎస్.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఏఎస్పీ(ఏఆర్)గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. అనంతపురంలోని ఓ పభుత్వ పాఠశాలలో ఏజీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు, డిజిటల్ స్లేట్ల పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఎస్పీ తన జీవన పోరాటాన్ని 400 మంది పిల్లలతో పంచుకున్నాడు. తన జీవన పోరాట యాత్ర విని నలుగురు మారినా ఆ నలుగురు సమాజానికి ఎంతో మేలు చేస్తారని తెలిపారు. ఆ ఐపీఎస్ హనుమంతు.. ఆయన జీవన పోరాటం ఎంత స్ఫూర్తిదాయకమో ఆయన మాటల్లో..
కరువు జిల్లా వాసినే..
నేను కరువు ప్రాంతం రాయలసీమ వాసినే.. మీ కన్నా చిన్నగా ఉన్నప్పుడు తినడానికి అన్నం కూడా దొరికేది కాదు.. ఇంటింటికీ తిరిగి అడుక్కు తినేవాడిని. అమ్మ, నేను ఇద్దం భిక్షాటనకు వెళ్లి ఆకలి తీర్చుకున్నాం. ఓ రోజు అడ్డుకుని తెచ్చుకున్న అన్నం ఓ రోజు చెట్టుకింద పెట్టుకుని తింటుంటే.. అటుగా పిల్లలు స్కూల్కు వెళ్తుండగా, నేను తినడం మానేసి వారినే చూస్తుండిపోయానట. అప్పుడు నాలో ఉన్న ఆసక్తిని మా అమ్మ గమనించింది. అప్పుడే బడికి పోతవారా అని అడిగితే వెళ్తా అన్నానట.
బడికి వెళ్తే అడుక్కునేవాడు అనుకున్నారు..
ఓ రోజు అమ్మ నన్ను స్కూల్లో జాయిన్ చేసింది. అడుక్కున్న చొక్కా తొడుక్కుని బడికి వెళ్లాను. అప్పుడు మాస్టారు చూసి నన్ను అడుక్కుతినే బాలుడు అనుకున్నాడు. పిల్లలందరికీ నేను అడుక్కు తినేవాడిని అని తెలుసు కాబట్టి బడికి అడుక్కోవడానికే వచ్చానని అనుకున్నారు. తరిమేశారు… తర్వాత నాలో ఆసక్తిని గమనించిన మా అమ్మ కొన్ని రోజుల తర్వాత ఓ విరిగిన పలక చేతికి ఇచ్చి మళ్లీ స్కూల్కు పంపింది. అప్పుడు మాస్టారు గమనించి చదువుకోవడానికి వచ్చావా.. రా అని తరగతిలో కూర్చో బెట్టారు.
రెండేళ్లు ఎవరూ స్నేహం చేయలేదు..
బడిలో చేరాను కానీ.. నన్ను ఎవరూ కలుపుకుపోలేదు. స్నేహం చేయలేదు. ఎందుకంటే నేను అడుక్కుతినేవాడినని అందరికీ తెలుసు. డ్రెస్సింగ్ కూడా మంచిగా ఉండేది కాదు. దీంతో సార్ ఉన్నప్పుడు ఏమీ అనని వాళ్లు.. సార్ వెళ్లాక దూకం కొట్టేవారు. ఇలా రెండేళ్లు గడిచింది. తర్వాత నా పరిస్థితి గమనించిన మాస్టారు మంచి బట్టలు ఇచ్చాడు. అప్పటి నుంచి కొంతమంది నాతో స్నేహం చేశారు.
తర్వాత పనులకు వెళ్లేవాడిని..
బడికివెళ్తున్నా కానీ ఆకలి మాత్రం తీరలేదు. దీంతో భిక్షాటన చేయకుండా పనికి వెళ్లే వాడిని పెళ్లిళ్లలో పని చేసేవాడిని, పిండప్రదానాలకు వెళ్లాను. చివరకు సమాధులు కూడా తవ్వడానికి వెళ్లేవాడిని. ఎందుకంటే ఆ పనులు చేస్తే అన్నం పెట్టేవారు. నేను తెచ్చే అన్నం కోసం మా అక్క, తమ్ముడు ఎదురు చూసేవారు. ఇలా ఇంటర్ వరకూ పనిచేశారు.
ఎప్పుడు చదువు మానలేదు..
నేను ఆకలి తీర్చుకోవడానికి ఏ పని చేసినా.. చదువును మాత్రం ఎప్పుడూ మానలేదు. పనులు చేసుకుంటూ బడికి వెళ్లాను. ఇలా ఇంటర్ వరకు కొనసాగించాను. స్కూల్కు వెళ్లొచ్చాక మల్లెపూలు కూడా అమ్మేవాడిని. అమ్మ పూలు అల్లి రెడీగా పెట్టేది. వాటిని తీసుకుని నల్లారి కిరణ్కుమార్రెడ్డిగారి తమ్ముడి భార్యకు అమ్మేవాడిని. ఆమె పావలా ఇచ్చేది. అమ్మ వారి పిల్లల బట్టలు అడిగి మాకు ఇచ్చింది. అన్నం అడిగేది. ఆమె పనివాళ్లకు చెప్పి అన్నం పెట్టి పంపేది. పుస్తకాలు నేనే కొనుక్కున్న, తిండి నేనే సంపాదించుకున్న. ఇంత కష్టపడడానికి కారణం నేను చదువుపై నాకు ఉన్న ఆసక్తి.. మరో కారణం అప్పుడు సెల్ఫోన్ లే కపోవడం.
మా అమ్మకు సమాజం నమస్కరిస్తుంది..
భిక్షాటన చేసుకుని చదివాను. చదువు నన్ను ఈస్థాయికి తీసుకొచ్చింది. నాడు మమ్మల్ని చీదరించుకున్నవారు ఇప్పుడు చేతులెత్తి నమస్కరిస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో ఆరుగురు డాక్టర్లు ఉన్నారు. మా అమ్మగారు బతికే ఉన్నారు. ఇప్పుడు అందరూ అడిషనల్ ఎస్పీ అమ్మగారని ఆమెను గౌరవిస్తున్నారు. ఎస్సైలు, సీఐలు మా ఇంటికి, మా ఊరికి వెళ్లినప్పుడు మా అమ్మను కలిసి నమస్కరిస్తారు. అమ్మ తర్వాత నాకు ఫోన్చేసి నాన్నా.. ఈరోజు ఇద్దరు పోలీస్ అధికారులు వచ్చారు. నాకు నమస్కరించారు అని గర్వంగా చెబుతుంది. ఎందుకంటే ఆగర్వం ఎలా వచ్చింది అంటే చదువుతోనే. కేవలం చదువే నన్ను ఈ స్థాయికి తెచ్చింది.
మీకు అన్నీ ఉన్నాయి..
ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయి. డిజిటల్ స్లేట్.. ప్రేమించే తల్లిదండ్రులు.. ఇంటికి వెళ్లగానే ఇష్టమైన భోజనం పెట్టే అమ్మనాన్న ఉన్నారు. నాకు నాడు చదువుకోమని ఎవరూ చెప్పలేదు. కేవలం నాకు ఉన్న ఆసక్తితోనే చదువుకున్నా. ఇప్పుడు చాలా మందిలో లేనిది అదే. ఇప్పుడు అందరి వద్ద సెల్ఫోన్ ఉన్నాయి. అవే వారి శత్రువులు. ఇన్ని వసతులు ఉన్నా చదువుకోకుండా చేసేది సెల్ఫోన్ మాత్రమే. కాబట్టి జాగ్రత్త. మీరు కూడా మీ తల్లిదండ్రులకు సమాజం నమస్కరించేలా ఎదగాలి. అందుకు కష్టపడాలి. శత్రువును దూరం పెట్టండి. చదువుపై శ్రద్ధ పెట్టండి’ అని సూచించారు. నా కష్టం విని నలుగురు మారినా నాకు ఆనందమే అని ముగించారు హనుమంతు.
శోకం నిండిన జీవితాన్ని ఎలా స్లోకమయ జీవితంగా మార్చగలిగే శక్తి కేవలం చదువుకు మాత్రమే ఉంది అనేదానికి హనుమంతు ఓ నిలువెత్తు నిదర్శనం. మనిషి సంకల్పించుకుంటే ఏదైనా సాధించగలడు. ఈ స్ఫూర్తిదాయక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుగురు కాదు చాలా మందిని ఈ వీడియో మారుస్తుందని ఆశిద్దాం!
