YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఒక వింత వైఖరి కనిపిస్తుంది. పార్టీ కోసం ప్రాణాలు అర్పించే నాయకులను, కార్యకర్తలను ఆయన పెద్దగా పట్టించుకోరు. కానీ అవినీతి చేసే నాయకుల విషయంలో మాత్రం చాలా ఆసక్తి కనబరుస్తారు. అటువంటివారు జైలుకు వెళ్తే వెళ్లి పరామర్శిస్తారు. కేసులకు గురైతే సంఘీభావం తెలుపుతారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో అలానే చేశారు. హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు బ్రహ్మ నాయుడు. తెలంగాణ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా బ్రహ్మానాయుడును పరామర్శించారు. నేను ఉన్నాను అంటూ ఆయన కుమారుడికి భరోసా ఇచ్చారు.
* సహాయం కోసం ఎదురుచూసి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే సోషల్ మీడియా కార్యకర్తలు చాలామంది కష్టాల్లో ఉన్నారు. కొందరైతే అత్యవసర, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. అటువంటి వారి గురించి అస్సలు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి.. ఎవరైనా దూకుడుగా వ్యవహరించి రాజకీయ ప్రత్యర్థులను తిట్టినా.. అవినీతి కేసుల్లో జైలు పాలు అయినా.. కేసులు ఎదుర్కొంటున్నా చాలా సానుభూతి చూపుతారు. వారిని పరామర్శిస్తారు. తమ పార్టీ వకీలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తో న్యాయసహాయం ఇప్పిస్తారు. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడుకు, ఆయన కుటుంబానికి అదే భరోసా ఇచ్చారు జగన్.
* కుమారుడికి పరామర్శ..
చాలా రోజులపాటు పరారీలో ఉన్న బ్రహ్మనాయుడు… తమిళనాడు కాంచీపురంలో తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే బ్రహ్మనాయుడు చేసింది తప్పు పని. ఆపై ప్రభుత్వ భూమికే అసరు పెట్టి వెయ్యికోట్ల ఆస్తులను కొల్లగొట్టాలని చూసారు. అది జగన్మోహన్ రెడ్డికి మంచి పనిగా కనిపించినట్టు ఉంది. అందుకే బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు గిరికి ఫోన్ చేసి.. ఏం కాదులే.. ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చిన క్రీడాకారుల మాదిరిగా అభినందనలు తెలిపినట్టు కనిపించారు. ఎంత పెద్ద స్కాం చేస్తే వైసీపీలో అంత గుర్తింపు అన్న మాదిరిగా జగన్ వ్యవహార శైలి ఉంది. కష్టపడి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తకు పలకరించరు కానీ.. ఇలాంటి అవినీతి చేసే బ్రహ్మానాయుడు లాంటి వారికి మాత్రం భరోసా ఇస్తున్నారు అంటూ నిజమైన కార్యకర్త బాధపడుతున్నారు. ఇలాంటివి పార్టీకి చేటు అని తెలిసిన అధినేత అదే పనిగా చేస్తుండడంపై కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎవరైనా ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. ప్రజల్లో ప్రతికూలత వచ్చిన అంశాలకు దూరంగా ఉంటారు. కానీ జగన్ అలా మాత్రం కాదు. నలుగురు వెళ్లే రూట్లో ఆయన వెళ్ళరు. ఎందుకంటే ఆయన రూటు సెపరేటు అన్నమాట.
