Big offer for TDP: ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. రెండో పెద్ద పార్టీ కూడా. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మెజారిటీని కూడా టిడిపి అందించగలిగింది. అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది కేంద్రం. ఇప్పటికే రెండు కేంద్రమంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్టును తెలుగుదేశం పార్టీకి కేటాయించింది కేంద్రం. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి కేంద్ర పెద్దలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. రేపు ఎన్డీఏ పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రేపు ఎన్ డి ఏ పక్ష సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు..
రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు రేపు ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. నీతి ఆయోగ్ తో పాటు ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని చర్చిస్తారు. అయితే ప్రధానితో జరిగే భేటీలో చంద్రబాబుకు ఆయన గుడ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది. ఒక సహాయ మంత్రి పదవితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేస్తారని సమాచారం.
మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్ పోస్ట్..
ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు జనసేనకు ఇద్దరు.. బిజెపికి మరో ముగ్గురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రం నుంచి. తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్రమంత్రి పదవులను కేటాయించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ కు క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి ఇచ్చి.. సహాయ మంత్రిగా మరొకరికి చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ సైతం చాలా రోజులుగా ఖాళీ ఉంది. దానిని సైతం ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టిడిపికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
