Madhya Pradesh: బిడ్డను కంటాం.. బెయిల్ ఇవ్వండి.. భర్త పెరోల్ కోసం భార్య స్కెచ్ అదిరింది!
ఇటీవల దారా భార్య జైలు అధికారులకు ఓ దరఖాస్తు చేసుకున్నారు. తనకు పిల్లలు కావాలని, అందువల్ల తన భర్తను పెరోల్పై విడుదల చేయాలని అభ్యర్థించింది. దీనిపై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆ మహిళ దరఖాస్తును శివ్పురి ఎస్పీకి పంపించినట్లు తెలిపారు.

Madhya Pradesh: సతీ సావిత్రి… మహాపతీవ్రత.. భర్త కోసం యముడితోనే పోరాటం చేసిందని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే సావిత్రిని చూసినవారు ప్రస్తుతం ఎవరూ లేరు.. సావిత్రి గురించి తెలిసినవారు కూడా చాలా తక్కువ. 1990వ దశకానికి ముందు పుట్టిన వారికి సతీ సావిత్రి పురాణం గురించి మాత్రం తెలిసే ఉంటుంది. అయితే ఆ సతీ సావిత్రి అంత సాహసం కాకపోయినా.. ఈమె మాత్రం జైల్లో ఉన్న తన భర్తను బయటకు తీసుకురావడానికి ఏకంగా జైలు అధికారులనే ఆశ్రయించింది. అయితే అందుకు ఆమె చెప్పిన కారణమే అందరినీ ఆశ్చర్యపర్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
సంతానం కావాలని..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సెంట్రల్ జైలు అధికారులకు ఓ మహిళ అరుదైన అభ్యర్థన చేసింది. తనకు సంతానం కావాలని.. అందుకోసం జైల్లో ఉన్న తన భర్తను పెరోల్పై విడుదల చేయాలని దరఖాస్తు చేసుకుంది. గ్వాలియర్లోని శివ్పురి ప్రాంతానికి చెందిన దారాసింగ్ జాతవ్ ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు దారాసింగ్ను అరెస్టు చేశారు. ఆ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి గ్వాలియర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
జైలర్కు దరఖాస్తు..
అయితే, ఇటీవల దారా భార్య జైలు అధికారులకు ఓ దరఖాస్తు చేసుకున్నారు. తనకు పిల్లలు కావాలని, అందువల్ల తన భర్తను పెరోల్పై విడుదల చేయాలని అభ్యర్థించింది. దీనిపై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆ మహిళ దరఖాస్తును శివ్పురి ఎస్పీకి పంపించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం.. జీవితఖైదు పడిన దోషి రెండేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్ పొందే అవకాశముందని జైలు అధికారులు తెలిపారు. అయితే దీనిపై జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
గతంలో కోర్టు తీర్పు ప్రకారమే..
దారా భార్య.. ఈ దరఖాస్తు ఊరికే పెట్టలేదు. ఆమ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పు గురించి తెలుసుకుంది. ఓ రాజస్థాన్ మహిళ ఇలాంటి అభ్యర్థనతోనే కోర్టును ఆశ్రయించగా.. అక్కడి హైకోర్టు అరుదైన తీర్పునిచ్చిన విషయం తెలుసుకుంది. సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకునేందుకు జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జోధ్పుర్ ధర్మాసనం.. ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఇప్పుడు దారా భార్య కూడా 15 రోజులైనా తన భర్తతో కలిసి ఉండే అవకాశం లభిస్తుందన్న ఆశతో జైలర్కు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకుంది.
నెట్టింట వైరల్..
దారా భార్య దరఖాస్తు విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అభినవ సతీ సావిత్రి అని కొందరు.. కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు హంతకుడిని ఎలా పెళ్లి చేసుకున్నావని కామెంట్ పెడుతున్నారు. మరికొందరు దారా భార్య ధైర్యాన్ని అభినందిస్తున్నారు. జీవితఖైదు పడిన భర్తను బయటకు తీసుకురావాలన్న ఆమె తపనను అభినందిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
