KTR: కేటీఆర్ తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణలో పదేళ్లు మంత్రిగా పనిచేశారు. 2018 నుంచి 2023 వరకు ముఖ్యమైన మంత్రిగా పెత్తనం చెలాయించారు. ఇదే సమయంలో హైదరాబాద్కు గ్లోబల్ గుర్తింపు తెచ్చారు. ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో యువతలో, ఐటీ ఉద్యోగుల్లో మంచి క్రేజ్ పొందారు. అయితే.. కేటీఆర్ అధికారంలో ఉన్ననాటి నుంచే ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు అప్పటి విపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ చేశాయి. బండి సంజయ్, రేవంత్రెడ్డి కేటీఆర్పై డ్రగ్స్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించేవారు. ఇక అధికారం కోల్పోయాక ఈ ఆరోపణలతోపాటు సినిమా హీరోయిన్లతో అక్రమ సంబంధాలు అంటగట్టారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ అక్రమ సంబంధాలపై ఆరోపణలు చేశారు. దీంతో కొన్ని అంశాల్లో ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేటీఆర్ ఆవేదన..
తాజాగా డ్రగ్స్, సినీమా నటులతో సంబంధాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై కేటీఆర్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. తాను సిగరెట్ కూడా తాగనని, అలాంటి నన్ను పట్టుకుని డ్రగ్స్ ఆరోపణలు చేశారని తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ హీరోయిన్లతో సంబంధాలపైనా దుష్ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాలను పదే పదే ప్రచారం చేయడం వల్ల నిజమనే నమ్మకం కలుగుతుందన్నారు. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు పెట్టడం వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నం చేశారన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం..
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదన్నారు. తనకు ఫ్యామిలీ ఉందని, ఇలాంటి ఆరోపణలతో వారు కూడా ఇబ్బంది పడతారన్నారు. ఎవరైనా వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు నేతల వ్యక్తిత్వం, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా, అభివృద్ధి, అక్రమాల పరంగా ఎదుర్కొవాలని హితవు పలికారు.
సోషల్ మీడియా చిలువలు పలువలు..
తనపై నాయకులు చేసే ఆరోపణలు సోషల్ మీడియాలో మరింతగా ట్రోల్ అవుతాయన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్లు చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఆరోపణలు నిరూపితం కాకపోయినప్పటికీ వాటి ప్రభావం నాయకుని దైనందిన జీవితం, కుటుంబం, ప్రజాభిమానంపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ చెప్పిన ఆవేదనను వ్యక్తిగత ఘర్షణగా మాత్రమే అర్థం చేసుకోవడం సరిపోదు. ఇది ఒక పెద్ద రాజకీయ వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. ఓ నేతను ప్రతిష్ఠాపరంగా నష్టం కలిగించే ప్రయత్నం, ప్రజా దృష్టిని విచ్చలవిడిగా చేయడమే.
