Ayyannapatrudu Receives Rare Honor: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి నర్సీపట్నం నియోజకవర్గం పై పడింది. అక్కడ టిడిపి నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కూడా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటానని అయ్యన్నపాత్రుడు పలుమార్లు ప్రకటించారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని కూడా ఇదే మాట చెప్పారు. వయసు రీత్యా అయ్యన్నపాత్రుడు క్రియాశీలక రాజకీయాలకు దూరం కావడం ఖాయం. ఎందుకంటే స్పీకర్ లాంటి గౌరవప్రదమైన, రాజ్యాంగబద్ధ పదవి అనుభవిస్తుండడంతో ఆయన పొలిటికల్ గా రిటైర్మెంట్ అవుతారు. అయితే ఆయన తరువాత నర్సీపట్నం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. నిన్నటి వరకు ఆ నియోజకవర్గ బాధ్యతలు చూసేవారు ఆయన కుమారుడు విజయ్. ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక కావడంతో మరింత యాక్టివ్ అవుతారు. కానీ నర్సీపట్నం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఆరేళ్లపాటు రాజ్యసభ పదవిలో ఉంటారు. అందుకే ఇప్పుడు నర్సీపట్నంపై పెద్ద చర్చ నడుస్తోంది.
టిడిపి ఆవిర్భావం నుంచి..
అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత వీర విధేయుడు. అదే సమయంలో ముక్కుసూటి మనిషి కూడా. టిడిపి ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. ఎన్ని పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా ఆయన మాత్రం వెళ్లలేదు. పార్టీ కష్ట కాలంలో ఉంటే సైలెంట్ గా ఊరుకోలేదు కూడా. తనలోనున్న ఫైర్ బ్రాండ్ ఎప్పటికీ తగ్గలేదు. అయితే తండ్రి మాదిరిగానే దూకుడుగా ఉండేవారు విజయ్. అదే ఆయనకు కలిసి వచ్చింది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేందుకు దోహద పడింది. సుదీర్ఘకాలం ఐటీడీపీకి సేవలు అందించారు విజయ్. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులతో వెంటాడిన భయపడలేదు. వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి విజయ్ పోటీ చేస్తారని అంతా ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక కావడంతో అయ్యన్న వారసుడు ఎవరు అనేది ప్రశ్న.
రెండో కుమారుడికి ఛాన్స్…
2029 ఎన్నికల నాటికి విజయ్ తన రాజ్యసభ పదవిని మూడేళ్ల పాటు పూర్తి చేసుకుంటారు. అప్పటికి మూడేళ్ల సమయం ఉంటుంది ఆయనకు. అయితే రాజ్యసభకు రాజీనామా చేసి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగుతారా? ఆ రాజ్యసభ పదవికి వేరొకరికి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. పోనీ విజయ్ కాకుంటే ఇతర నేతలకు టికెట్ ఇస్తామంటే.. అయ్యన్న కుటుంబానికి కాదని టిడిపి శ్రేణులు ఆదరించే అవకాశమే లేదు. అయితే అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు రాజేష్ ఉన్నారు. ప్రస్తుతం నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు. రాజేష్ ను పోటీలో పెట్టి అయ్యన్నపాత్రుడు తో పాటు విజయ్ గెలిపించుకుంటారన్న టాక్ ఉంది.. మొత్తానికి అయితే అయ్యన్నపాత్రుడు తన పెద్ద కుమారుడిని రాజ్యసభకు పంపించి.. చిన్న కుమారుడిని ఎమ్మెల్యేగా చేసి.. పిల్లలిద్దరి రాజకీయ భవిష్యత్తును చూసి ఆనందిస్తారన్నమాట. కానీ చాలా రాజకీయ కుటుంబాలు ఉన్నాయి కానీ.. అయ్యన్నపాత్రుడు లాంటి అవకాశం ఎవరికీ దక్కదన్న మాట.
