How India Was Formed: భూమి ఈరోజు కనిపిస్తున్నట్లు కోట్ల సంవత్సరాల క్రితం లేదు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఖండాలు, సముద్రాలు, పర్వతాలు అన్నీ కోట్ల ఏళ్ల భౌగోళిక మార్పుల ఫలితం. భారతదేశం కూడా ఒకప్పుడు ఆసియాలో భాగం కాదు. అది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక భారీ పురాతన ఖండంలో భాగంగా ఉండేది. అక్కడి నుంచి విడిపోయి ఉత్తర దిశగా ప్రయాణించి చివరకు ఆసియాను ఢీకొని హిమాలయాలను సృష్టించింది. ఈ కథ భూమి చరిత్రలోనే అత్యంత అద్భుతమైన భౌగోళిక ప్రయాణంగా చెప్పబడుతుంది. ఆసక్తగా అనిపించే ఆ కథలోకి వెళ్తే..
భూమిపై రెండు మహా ఖండాల కాలం:
సుమారు 55 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఇప్పటి లాంటి ఏడు ఖండాలు లేవు. అప్పట్లో భూమి ప్రధానంగా రెండు మహా ఖండాలుగా ఉండేది. ఉత్తర భాగంలో ఉన్న ఖండాన్ని ‘లారేసియా’ అని, దక్షిణ భాగంలో ఉన్న ఖండాన్ని ‘గొండ్వానా’ అని పిలిచేవారు. ఈ గొండ్వానా ఖండంలోనే ప్రస్తుతం ఉన్న భారతదేశం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, మడగాస్కర్, దక్షిణ అమెరికా కలిసి ఉండేవి. కోట్ల ఏళ్ల పాటు ఈ భూభాగంలో అడవులు, నదులు, జంతువులు విస్తరించాయి.
గొండ్వానా అనే పేరు ఎలా వచ్చింది?
‘గొండ్వానా’ అనే పేరు కూడా భారతదేశంతోనే ముడిపడి ఉంది. మధ్య భారతదేశంలో నివసించే గోండ్ తెగ పేరు మీదే ఈ ఖండానికి ఆ పేరు పెట్టారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్తలు మధ్య భారతదేశంలో ప్రాచీన శిలలను, బొగ్గు నిక్షేపాలను పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని ‘గొండ్వానా ప్రాంతం’గా పిలుస్తుండటంతో, అక్కడి శిలా నిర్మాణాలకు కూడా అదే పేరు పెట్టారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన శిలలు ఇతర ఖండాల్లో కూడా కనిపించడంతో, ఆ పురాతన మహా ఖండాన్ని ‘గొండ్వానా’గా గుర్తించారు.
భూమి లోపల మొదలైన మహా మార్పులు:
కాలక్రమేణా భూమి లోపల ఉన్న వేడి లావా, భౌగోళిక ఒత్తిడులు పెరగడం ప్రారంభమైంది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల గొండ్వానా ఖండంలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ఒత్తిడి కారణంగా ఒకప్పుడు ఏకంగా ఉన్న గొండ్వానా మూడు ప్రధాన భాగాలుగా విడిపోయింది. ఒక భాగం దక్షిణ అమెరికాగా, మరో భాగం ఆఫ్రికాగా మారగా, మూడో భాగంలో భారతదేశం, మడగాస్కర్, ఆస్ట్రేలియా కలిసి ప్రయాణం ప్రారంభించాయి.
మడగాస్కర్ నుంచి భారతదేశం విడిపోవడం:
సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం భారతదేశం , మడగాస్కర్ మధ్య కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భారతదేశం ప్రత్యేక భూభాగంగా విడిపోయి ఉత్తర దిశగా వేగంగా ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో భారతదేశం పశ్చిమ భాగంలో భూగర్భ మార్పుల వల్ల పశ్చిమ కనుమలు ఏర్పడ్డాయి. వీటి తర్వాత భారతదేశ వాతావరణంపై కీలక ప్రభావం చూపించాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే రుతుపవనాలను అడ్డుకుని భారీ వర్షాలు కురిసేలా చేశాయి. అందుకే పశ్చిమ కనుమలు భారతదేశపు ‘వర్ష గోడ’గా కూడా భావిస్తారు.
ఆస్ట్రేలియా కూడా దూరమైంది:
సుమారు 8 కోట్ల సంవత్సరాల క్రితం భారతదేశం, ఆస్ట్రేలియా కూడా విడిపోయాయి. ఆస్ట్రేలియా తూర్పు దిశగా కదలగా, భారతదేశం మాత్రం అత్యంత వేగంగా ఉత్తర దిశగా ప్రయాణించింది. భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, అప్పట్లో భారత ప్లేట్ సంవత్సరానికి 15 నుంచి 20 సెంటీమీటర్ల వేగంతో కదిలింది. ఇది టెక్టానిక్ ప్లేట్లలో అత్యంత వేగంగా కదిలిన ప్లేట్లలో ఒకటిగా గుర్తించబడింది.
డెక్కన్ పీఠభూమి ఎలా ఏర్పడింది?
భారతదేశం ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న సమయంలో భూమి లోపల భారీ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. లావా వేల కిలోమీటర్ల మేర విస్తరించి గట్టిపడి డెక్కన్ పీఠభూమి ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలు ఈ డెక్కన్ ట్రాప్లో భాగంగా ఉన్నాయి. ఈ అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఇదే కాలంలో డైనోసర్ల అంతరించిపోవడానికి కూడా ఈ విస్ఫోటనాలు ఒక కారణంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆసియాను ఢీకొన్న భారతదేశం
సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఉత్తర దిశగా దూసుకెళ్తున్న భారత ప్లేట్ చివరకు యురేషియన్ ప్లేట్ను ఢీకొట్టింది. ఈ ఢీకొన్న సమయంలో సముద్ర అడుగున ఉన్న శిలలు, భూభాగాలు పైకి లేవడం ప్రారంభించాయి. కోట్ల ఏళ్ల పాటు జరిగిన ఈ ఒత్తిడి వల్లే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి అయిన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ భారత ప్లేట్ కదులుతూనే ఉండటంతో హిమాలయాలు ప్రతి సంవత్సరం కొద్దిగా ఎత్తు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారతదేశం భూమిపై అద్భుత ప్రయాణం:
ఒకప్పుడు దక్షిణ అర్ధగోళంలో ఉన్న భారతదేశం, కోట్ల ఏళ్ల ప్రయాణం చేసి ఆసియాలో భాగమైంది. ఈ ప్రయాణమే భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చింది. హిమాలయాలు, డెక్కన్ పీఠభూమి, పశ్చిమ కనుమలు, నదులు, వాతావరణం ఈ భౌగోళిక మార్పుల ఫలితాలే. అందుకే భారతదేశం కథ కేవలం ఒక దేశ చరిత్ర కాదు, భూమి పరిణామ క్రమంలో జరిగిన అద్భుత గాథగా భావిస్తారు.
