TPCC Chief Controversy: ఏం జరిగిందో తెలియదు. ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాకపోతే మాడు వాసన వస్తోంది. దీనికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ఎదురైనప్పుడు.. ఎవరు కూడా తమకేం తెలియదు అన్నట్టుగా మొహాలు పెడుతున్నారు.. కానీ ఇలా పార్టీ ప్రజల్లో పరువు పోగొట్టుకుంటుంటే.. ఆ తదుపరి ఏం జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది ఇదే.
ఆ మీడియా ఛానల్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన అనుకూలమైన వార్తలు.. ప్రభుత్వానికి సంబంధించిన అడుకూలమైన కథనాలను అది ప్రసారం చేస్తూ ఉంటుంది. అటువంటి చానల్లో ఉన్నట్టుండి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇది ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు మహేష్ కుమార్ గౌడ్ కు పొమ్మనలేక పగబెడుతున్నారా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.. ప్రతిష్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు దగ్గరగా ఉండటం లేదు.. ప్రభుత్వ పథకాలను ఆయన ప్రచారం చేయడం లేదు. విదేశాలలో ఎక్కువ సమయం ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల విభాగాలను కూడా అంతగా శక్తివంతం చేయలేదు. దీంతో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా రెచ్చిపోతుంది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాన్ని తీవ్రమైన ఇరకాటంలో పెడుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. మహేష్ కుమార్ గౌడ్ పెద్దగా పట్టించుకోవడంలేదని ఆ చానల్లో వరుసగా కథనాలు ప్రసారం అయ్యాయి.
ఆ చానల్ యాజమాన్యంలో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర మిత్రులని తెలుస్తోంది. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన దగ్గర వ్యక్తికి ఇవ్వలేదని.. అందువల్లే మహేష్ కుమార్ గౌడ్ మీద ఈ స్థాయిలో నెగిటివ్ వార్తలు ప్రసారం చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఆ చానల్ తనపై ప్రసారం చేసిన వ్యతిరేక కథనాల పట్ల స్పందించారు. మీడియా మీద గౌరవం ఉంది కాబట్టి తాను ఏమీ అనలేకపోతున్నారని.. కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందని ఆయన ప్రకటించారు.
ఆ చానల్ ప్రసారం చేసిన కథనాన్ని కాస్త పక్కన పెడితే మహేష్ కుమార్ గౌడ్ టీపిసిసి ప్రెసిడెంట్ అవ్వడానికి ముఖ్య కారకుల్లో రేవంత్ రెడ్డి కూడా. పైగా ఇటీవల ఆయన 2034 వరకు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీ ముఖ్యమంత్రి అవతారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేసిన తర్వాత.. మహేష్ కుమార్ గౌడ్ బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం సీఎం రేవంత్ రెడ్డికి నచ్చలేదని తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఒక వర్గంగా.. రేవంత్ రెడ్డి మరొక వర్గం గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ మీద ఇలాంటి కథనం ప్రసారం కావడం పట్ల కాంగ్రెస్లో ఉన్న అంతర్గత పోరు మరొకసారి బయటపడింది.
కాంగ్రెస్ పార్టీ దక్షిణ భారత దేశంలో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉంది.. తమిళనాడులో అధికార భాగస్వామి పార్టీగా ఉంది.. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణనే కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ నాయకులు అధిష్టానానికి ఇప్పుడు బలమైన మద్దతు ఇస్తున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంతర్గత పోరుతో అసలుకే మోసం తెచ్చుకునే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
